top of page
  • Facebook
  • Twitter
  • Instagram
Search

An Overview of the New Testament (Telugu Version)

  • Writer: paradise ecstasy
    paradise ecstasy
  • Jul 10
  • 3 min read

క్రొత్త నిబంధన – పరిచయం

దాని నేపథ్యం, ఉద్దేశ్యం మరియు సందేశం

 


ఉపోద్గతం

ఎఫెసీ. 1:3-10 ప్రకారము భూమి, ఆకాశములు  లేనపుడే దేవుడు  మానవులను  గురించి ఆలోచించి  (సంకల్పించి) అతడు తన యెదుట  పరిశుద్ధుడుగాను నిర్దోషిగాను  ఉండి తనకు  కుమారుడుగా  అవ్వాలనే ఉద్దేశంతో భూమి, ఆకాశములను సృష్టించి, తరువాత  భూమిపై మానవులను  సృష్టించెను.


దేవునిచేత సృష్టించబడిన మొదటి ఆదాము దేవుని పోలికలో సృష్టించబడ్డాడు. దేవుని పోలిక అనగా (స్వభావ, గుణలక్షణాలు) తరువాత ఆదాముకు జతగా దేవుడు అవ్వను, ఆదాము ప్రక్కటెముకనుండి తయారుచేసెను. వారిరువురూ నిష్కల్కషులుగా, పరిశుద్ధులుగా ఉండి, దేవునితో సమాధానము, తండ్రి బిడ్డల సంబంధము కలిగి ఉన్నారు (లూకా 3:38).


వీరున్న ఏదేను వనములోనికి సాతాను (ప్రవేశించి ముందుగా అవ్వను, అవ్వద్వారా  ఆదామును కూడా మోసపరచి వారి స్వభావములోనికి అనగా (పరిశుద్ధత, నిర్దోషత్వమునకు) వ్యతిరేకమైన స్వభావ మార్పును తీసుకొనివచ్చెను. అప్పుడు వారు దేవునితో అబద్ధమాడుట, దేవుని చూసి  భయపడుట, సిగ్గుపడుట, అవమానపడుట, మోసం మొదలగు  లక్షణాలతో  నింపబడి  సాతాను  స్వభావంలోనికి  మారిపోయారు.

అందుచేత దేవుడు వారిని శపించి వారు (బ్రతుకు దినములన్నియు ప్రయాసముతో కూడిన దినములుగా  మార్చెను. అయితే దేవుడు ఆదాము సంతానము నుండి తన యెదుట పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవించువారిని విడిచిపెట్టకుండా ఆశీర్వదిస్తూ వారిని రక్షించెను. ఆదాము సంతానములో హేబేలు నీతిమంతుడని దేవునిచేత సాక్ష్యము పొందెను.


తరువాత హానోకు దేవుని స్వభావమును అనుసరించి నడుచుకొనెను గనుక దేవుడు హానోకును తనతో కూడా ఉండు నిమిత్తము తీసుకొనిపోయెను. భూమిమీద నరులు (మానవులు) ఎక్కువగా విస్తరించి వారికిష్టమొచ్చినట్లు సాతాను స్వభావమును అనుసరించి పాపాలు చేస్తూ జీవిస్తున్నారు. ఆకాలంలో దేవుడు తనయెదుట  నీతిమంతునిగా  జీవిస్తున్న వారికొరకు  కనిపెట్టి  చూచినప్పుడు  నోవహు  కుటుంబము  మాత్రమే దేవునికి కనిపించింది. కనుక  దేవుడు  నోవహు  కుటుంబమును రక్షించి ఆ కాలపు ప్రజలందరిని (మానవులందరిని) జలప్రకళయము ద్వారా నశింపచేసాడు.


నోవహు సంతానము అభివృద్ధి చెందిన తరువాత దేవుడు చూచినప్పుడు వారిలో ఒక్కడును నీతిమంతుడుగా కనిపించలేదు. అబ్రహాము  మాత్రమే దేవుని  నమ్మి దేవుని పిలుపు  విని తనస్వజనులను  అనగా విగ్రహారాధికులైనవారిని విడిచి దేవుని మాట ప్రకారము ప్రయాణించాడు. దేవుడు అబ్రాహాముతో  నిబంధన చేసెను. అబ్రాహాము సంతానమును అభివృద్ధిపరచి దీవిస్తానని దేవుడు వాగ్దానము చేసెను. ఆ ప్రకారము దేవుడు అబ్రాహాము సంతానమును దీవించి వారు తన మనస్సును తెలుసుకొను నిమిత్రము ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను ఇచ్చెను. వాటినిబట్టి వారు తన మనసు తెలుసుకొని తన యెదుట పరిశుద్ధులుగాను, నిర్మోషులుగాను జీవించాలని దేవుడు చెప్పెను, అయితే అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు లేక యూదులు దేవుని నిబంధనలకు నిలువలేకపోయిరి గనుక దేవుడు వారిని అన్యుల చేతికి అప్పగించెను. ఈ విధంగా వారు అనేకసార్లు అన్యులవద్ద బానిసలుగా జీవించారు. అన్యుల  వల్ల కల్గుచున్నటువంటి  శ్రమలను బట్టి వారు మెస్సయ్య కొరకు ఎదురుచూస్తూ వచ్చారు.


కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన చిత్తప్రకారముగా మెస్సయ్యను (యేసుక్రీస్తును) ఈ లోకానికి కన్య మరియ ద్వారా పంపించాడు. అయితే ఆనాటి ప్రజలు మెస్సయ్యను గుర్తించలేదు. తూర్పు దేశపు జ్ఞానులు మరియు గొల్లలు మాత్రమే (గొఱ్ఱెలకాపరులు) మాత్రమే గుర్తించిరి. ఆయన చేసిన అద్భుతములు, ఆయన బోధించిన విషయాలు ఆయనే మెస్సయ్య అని రుజుపు చేస్తున్నాయి. అంతేకాక ప్రవక్తయైన ఏలీయా ఆత్మ బాప్తీస్మమిచ్చు యోహాను రూపంలో మైస్సయ్యకు మార్గము సరాళము చేయుటకు పంపబడెను.

 

బాప్తీస్మమిచ్చు యోహాను కొద్దిమందిని శిష్యులుగా చేసుకొని మెస్సయ్య రాకడ కొరకు మార్గము సరాళము  చేయుచు సంచరించుచు మెస్సయ్యను గూర్చి సాక్ష్యమిచ్చుటకు యోర్ధాను నది వద్ద మారుమనస్సు  విషయమైన బాప్తీస్మమిచ్చుచుండెను. ఆ సమయంలో యేసు యోహాను వద్దకు వచ్చి బాప్తీస్మం పొందెను. అప్పుడు యేసును చూచి "ఇదిగో లోకపాపమును మోసికొని పోవు దేవుని గొఱ్ఱెపిల్ల అని సాక్ష్యమిచ్చెను. ఈ సాక్ష్యము విన్న యోహను శిష్యులలో కొందరు యేసును వెంబడించి ఆయన చేసిన అద్భుతములు, ఆయన బోధించిన విషయాలు, ఆయన జీవితము ప్రవచనాల  సారమైనదని  గ్రహించి  ఆయనే  మెస్సయ్య అని సాక్ష్య మిచ్చిరి.

 

పాత నిబంధనలో అనేక ప్రవచనాలు మెస్సయ్యను గూర్చి (ప్రవచించబడ్డాయి. ఆ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు జీవితంలో జరుగుటను బట్టి ఆయనే మెస్సయ్య అని రుజువగుచున్నది. ఆయన లేఖనముల ప్రకారము మానవుల పాపము నిమిత్తము  సిలువ మీద మరణించి  సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి శిష్యులకు కన్పించి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము ఇచ్చి పరలోకమునకు ఆరోహణమాయెను.


ఈ సంఘటనలకు ప్రత్యక్ష సాక్షులైన ఆయన శిష్యులు యూదులకు భయపడి పారిపోయిరి. వారు మేడగదిలో కూడుకొని ప్రార్ధించుచుండగా యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానము ప్రకారము పరిశుద్ధాత్మను పొందిరి. పరిశుద్ధాత్ముడు కొంతమందిని ప్రేరేపించి తరువాతి తరమువారు ఈ సత్యాలను గ్రహించునట్లు రక్షణపొందునట్లు వారిచేత క్రొత్త నిబంధన గ్రంథమును వ్రాయించెను.

ఈ క్రొత్తనిబంధనలో ఇరవై ఏడు పుస్తకములు కలవు. ఈ క్రొత్తనిబంధనను నాలుగు భాగాలుగా విభజించవచ్చును.

1. సువార్తలు

2. అపోస్తలుల కార్యములు.

3. పత్రికలు,

4. ప్రకటన గ్రంథము

 

1. సువార్తలు

ఈ సువార్తలలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక, బాల్యం, ఆయన చేసిన అద్భుతములు, ఆయన చేసిన బోధలు,మానవుల విమోచన క్రయధనముగా తన్సుతాను అర్పించుకొనిన విధానము (సిలువ మరణము) పునరుత్తానము, ఆయన పరిచర్య మొ॥ విషయాలను గూర్చి వ్రాయబడినవి.

ఈ సువార్తలు చదువుట ద్వారా మానవులు రక్షణను పొందగలరు.

 

2. అపోస్తలుల కార్యములు 

ఆయన శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఆత్మ ప్రేరేపణను బట్టి వారు సువార్త ప్రకటించిన  విధానము, సువార్త నిమిత్తము వారు పడిన శ్రమలద్వారా దేవుడు చేసిన అద్భుతాలు మొ॥నవి ఇందులోవ్రాయబడ్డాయి. 

ఈ గ్రంథమును చదువుట ద్వారా పరిశుద్ధాత్మ అనుభవము పొందగలము (తెలుసుకొనగలము).

 

3. పత్రికలు

ఆ దినాలలో అపోస్తలుల సువార్త పరిచర్య ద్వారా ఏర్పడిన సంఘాలకు అపోస్తలులు ప్రాసిన అనేక  ఆత్మ సంబంధమైన క్రైస్తవ జీవితానికి సంబంధించిన విషయాలను పత్రికలు అనబడుచున్నవి. ఇందులో రెండు రకాలైన పత్రికలు కలవు

1. సేవకులనుద్దేశించి వ్రాసిన పత్రికలు.

2. విశ్వాసులనుద్దేశించి వ్రాసిన పత్రికలు.

ఈ పత్రికలు చదువుట ద్వారా ఆత్మీయ జీవిత అనుభవాన్ని సంపాదించుకొనగలము.

 

4. ప్రకటన (గ్రంథము

ఈ గ్రంథములో విశ్వాసులైన వారు పొందబోవు మహిమను గూర్చి, అవిశ్వాసులైన  వారు  పొందబోవు  తీర్పును గూర్చి, శ్రమలను గూర్చి, దేవుని ఉగ్రతను గూర్చి, ఈ లోక అంతము గూర్చి వ్రాయబడినది. క్రొత్త నిబంధనలో ఇదొకటే ప్రవచన గ్రంథము.

విశ్వాసులైన వారు ఈ గ్రంథమును చదువుటద్వారా పరలోక అనుభవాన్ని తెలుసుకొనగలరు.


యేసుక్రీస్తు యొక్క జననము, జీవితము, ఆయన కార్యములు, ఆయన బోధలు, ఆయన  మరణము ఆయన పునరుత్థానము ప్రవచనానుసారమైనదని రుజువు పరుస్తూ క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడినది.


In Christ,

Bro. Bandi S Herold


 
 
 

Comments


© 2021 Paradise Ecstasy Association. All rights reserved.

bottom of page